రాంబో సర్కస్ గ్రాండ్ ఎంట్రీ,ఘనంగా ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి నవీన్ యాదవ్
హైదరాబాద్, (మా భూమి టైమ్స్) ఏప్రిల్ 10: దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన *రాంబో సర్కస్* ప్రపంచ సర్కస్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో మళ్లీ ప్రారంభం కానుంది. వినూత్న ప్రదర్శనలు, అంతర్జాతీయ స్థాయి కళాకారులతో ప్రేక్షకులను అలరించే ఈ సర్కస్, నగర ప్రజలకు ప్రత్యేక వినోదాన్ని అందించనుంది. చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో విజయవంతమైన ప్రదర్శనల అనంతరం, రాంబో సర్కస్ హైదరాబాద్లో మరింత గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సర్కస్ ప్రదర్శనలు యూసుఫ్గూడలోని శ్రీ సత్యసాయి నిగమాగమం ఆడిటోరియంలో ఈ నెల 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్వహించబడనున్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు అదేవిధంగా పిల్లలతో వారి యొక్క తల్లిదండ్రులతో కలిసి వీక్షించారు. ప్రదర్శనల్లో రింగ్ హెడ్ బ్యాలెన్స్, హ్యూమన్ స్లింకీ, నైఫ్ త్రో, రోలా బోలా, క్విక్ చేంజ్, ఏరియల్ రోప్, స్కేటింగ్ వంటి అనేక వినూత్న, ఉత్కంఠభరిత యాక్ట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. విదేశీ కళాకారుల ప్రత్యేక విన్యాసాలు ఈ కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలవనున్నాయి. అత్యాధునిక లైటింగ్, లేజర్ షోలు, ఎల్.ఈ.డి డాన్స్ ప్రదర్శనలు, శ్రావ్యమైన సంగీతం, సాంకేతిక సౌకర్యాలతో ఈ సర్కస్ ప్రదర్శనలు కుటుంబ సమేతంగా ఆస్వాదించగల వినోదంగా రూపుదిద్దుకున్నాయి. సుమారు 1 గంట 40 నిమిషాలపాటు సాగే ఈ ప్రదర్శనలు చిన్నారుల నుండి పెద్దల వరకు అందరినీ అలరించనున్నాయి. సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 4 గంటలు, రాత్రి 7 గంటలకు ప్రదర్శనలు ఉండగా, శని, ఆదివారాల్లో ఉదయం 11 గంటతో పాటు నాలుగు షోలు నిర్వహించబడనున్నాయి. టికెట్లు ఆన్లైన్లో బుక్ మై షో ద్వారా మరియు ప్రదర్శన వేదిక వద్ద అందుబాటులో ఉన్నాయి. 1991లో స్థాపించబడిన రాంబో సర్కస్, భారత సర్కస్ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. సాంప్రదాయ సర్కస్ కళలను ఆధునిక సాంకేతికతతో మేళవిస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తోంది. ఈ కార్యక్రమాన్ని రాంబో సర్కస్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. నగర ప్రజలు కుటుంబ సమేతంగా హాజరై ఈ అద్భుత వినోదాన్ని ఆస్వాదించాలని నిర్వాహకులు సుజిత్ దిలీప్, మామిడాల సంపత్ కోరుతున్నారు.





