కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మోహన్ వడ్లపట్ల – జో శర్మ థ్రిల్లర్ మూవీ ‘M4M’

0
240
Mohan Vadlapatla – Jo Sharma Thriller Film ‘M4M’ screening at Cannes
Mohan Vadlapatla – Jo Sharma Thriller Film ‘M4M’ screening at Cannes

టాలీవుడ్ నిర్మాత మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘M4M’ (Motive for Murder) ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అరుదైన అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రం మే 17న సాయంత్రం 6:00 గంటలకు కేన్స్‌లోని “PALAIS – C” థియేటర్‌లో ప్రైవేట్ స్క్రీనింగ్ జరగనుంది. గొప్ప అభిరుచిగల నిర్మాతగా గుర్తింపు పొందిన మోహన్ వడ్లపట్ల, ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ప్రముఖ అమెరికన్ నటి జో శర్మ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. విడుదలకు ముందే ఈ సినిమా అనేక అంతర్జాతీయ ప్రశంసలు, అవార్డులు సొంతం చేసుకుంటోంది.

ఇటీవలి కాలంలో జో శర్మ ‘Waves 2025’ ఈవెంట్‌లో అమెరికన్ డెలిగేట్/నటిగా పాల్గొని, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులతో పాటు అత్యంత గౌరవాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా M4M టీమ్ ముంబయిలోని IMPPA ప్రివ్యూ థియేటర్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ, “మా సినిమాను కేన్స్‌లో ప్రదర్శించడమన్నది ఒక గొప్ప అవకాశం, ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. మా టీమ్ అంతా చాలా ఉత్సాహంగా, ఆహ్లాదంగా ఉంది. త్వరలోనే ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నాం” అని తెలిపారు.

‘M4M’ సినిమా హత్యా కథాంశం ఆధారంగా రూపొందిన ఉత్కంఠభరిత థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రానికి అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇకపోతే, హంతకుడెవరో ఊహించిన వారికి 1000 డాలర్లు లేదా ఒక లక్ష రూపాయల బహుమతి ఇవ్వనున్నట్టు చిత్రబృందం వెల్లడించింది.

మోహన్ వడ్లపట్ల టాలీవుడ్ లో ‘మల్లెపువ్వు’, ‘మెంటల్ కృష్ణ’, ‘కలవరమాయే మదిలో’ వంటి గొప్ప చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు ‘M4M’ ద్వారా దర్శకుడిగా మారారు. ఈ చిత్రానికి కేన్స్‌లో లభించిన గౌరవం తాము సృష్టించుకున్న ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచిందని చెప్పారు.