లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. రెండు పక్షాలు తక్షణమే స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన కోరారు. ఇరాన్తో అత్యంత కీలకమైన శాంతి ఒప్పందం సమీపిస్తున్న ఉత్కంఠభరిత నేపథ్యంలో బీరుట్పై ఈ తరహా దాడి జరిగి ఉండాల్సింది కాదంటూ తన సోషల్మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్కు ఖచ్చితంగా ఉందని అభిప్రాయపడిన ట్రంప్.. అయితే ప్రత్యర్థి చేసిన దాడి చాలా చిన్నదని, దాని వల్ల పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని గుర్తుచేశారు. అందువల్ల ఇజ్రాయెల్ ఇకపై లెబనాన్లో ఎక్కడా దాడులకు దిగకూడదని గట్టిగా హితవు పలికారు. అదే సమయంలో హెజ్బొల్లా సహా ఇతర ఇరాన్ అనుబంధ గ్రూపులు కూడా ఇజ్రాయెల్పై దాడులను తక్షణమే ఆపేయాలని స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ శాంతికి దౌత్యపరంగా ఎంతో చేరువవుతున్న వేళ, ఇలాంటి తొందరపాటు చర్యలతో ఆ చారిత్రాత్మక ఒప్పందాన్ని నాశనం చేయవద్దని ట్రంప్ హెచ్చరించారు. అంతకుముందు ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లాకు పట్టున్న బీరుట్ దక్షిణ శివార్లలోని ఓ భవనంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. యుద్ధాన్ని ముగించే ఒప్పందం ఆదివారమే కుదిరే అవకాశం ఉందని ట్రంప్ గతంలో చెప్పినప్పటికీ.. ఇప్పటివరకు దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.





