దేశ భద్రత, సంక్షోభ సమయాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ గందరగోళం సృష్టించే శక్తుల కుట్రలను తిప్పికొట్టడంలో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఢిల్లీలోని కర్తవ్య భవన్లో శిక్షణ పొందుతున్న 2009, 2023, 2024 బ్యాచ్లకు చెందిన గ్రూప్-ఏ ట్రైనీ అధికారులతో ఆయన మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐఐఎస్ అధికారులు కేవలం సమాచార మాధ్యమకారులుగా మాత్రమే కాకుండా, జాతీయ ఐక్యతకు పరిరక్షకులుగా నిలవాలని సూచించారు.వేగంగా మారుతున్న ప్రస్తుత ప్రపంచంలో సమర్థవంతమైన కమ్యూనికేషన్ అనేది కేవలం పరిపాలనా సాధనం మాత్రమే కాదని, అది జాతీయ స్థిరత్వానికి , ప్రజల విశ్వాసానికి మూలస్తంభమని మంత్రి పేర్కొన్నారు. యుద్ధం చేయకుండానే సమాచార వ్యాప్తి ద్వారా శత్రువుల మనసులను ప్రభావితం చేయడంలో టీవీ, రేడియో సహా సోషల్ మీడియా వంటివి ‘సైకలాజికల్ ఆపరేషన్స్’ నిర్వహిస్తూ ముఖ్య భూమిక పోషిస్తాయన్నారు. బలాన్ని కాకుండా మేధస్సును ఉపయోగించి చేసే సమాచార యుద్ధంలో ఐఐఎస్ అధికారులు అగ్రభాగాన నిలబడాలని పిలుపునిచ్చారు.సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదారి పట్టించే ఫేక్ న్యూస్ పెద్ద సవాలుగా మారిందని, వాటిని అధిగమించేందుకు అధికారులకు ఇచ్చే ప్రత్యేక శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని బండి సంజయ్ తెలిపారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమాచార సమగ్రతను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మీడియా విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ రాజ్ కుమార్, ఐఐఎస్ కోర్స్ డైరెక్టర్ రష్మీ రోజా తుషార నాయర్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





