
హైదరాబాద్లోని రవీంద్రభారతి లో రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “ప్రతిభా పురస్కారాలు – 2026” కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగింది.
తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి వీరశైవ లింగాయత్ లింగ బలిజ సమాజానికి చెందిన ఎస్ఎస్సీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులను ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. దాదాపు 300 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని పురస్కారాలు అందుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య , జహీరాబాద్ పార్లమెంట్ లోక్సభ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ హాజరయ్యారు. అలాగే రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం గౌరవ అధ్యక్షులు పట్టణ సోమశేఖర్ , రాష్ట్ర అధ్యక్షులు దినేష్ పాటిల్ , ప్రధాన కార్యదర్శి రాచప్ప , రాష్ట్ర కోశాధికారి శివశరణ్ ,క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శెట్టి శివ కుమార్ , రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు పట్లోళ్ల భరత్ కుమార్ , సోమేశ్ , విద్యుల్లత తదితరులు పాల్గొన్నారు.
సంఘం గౌరవ అధ్యక్షులు పట్లోళ్ల సంగమేశ్వర్ మాట్లాడుతూ, రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం గత 13 సంవత్సరాలుగా సమాజ అభివృద్ధి, హక్కులు , సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. వీరశైవ లింగాయత్ లింగ బలిజలను బీసీ జాబితాలో చేర్చే అంశంలో సంఘం విశేష కృషి చేసి విజయాన్ని సాధించిందని, అలాగే ఓబీసీ జాబితాలో చేర్చేందుకు కూడా నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్ర అధ్యక్షులు దినేష్ పాటిల్ మాట్లాడుతూ, యువత సన్మార్గంలో పయనించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, వారి అభివృద్ధికి సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు పట్లోళ్ల భరత్ కుమార్ మాట్లాడుతూ, గత 13 సంవత్సరాలుగా రాష్ట్ర సంఘం తరఫున సుమారు 3,000 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం జరిగిందని, వారిలో అనేక మంది నేడు ఉన్నత స్థానాల్లో స్థిరపడి సమాజానికి సేవలందిస్తున్నారని తెలిపారు.
ముఖ్య అతిథి ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, వీరశైవ లింగాయత్ లింగ బలిజ సమాజానికి తన పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, వారి అభివృద్ధి కోసం అవసరమైన ప్రతి సందర్భంలో అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు సంఘ ప్రతినిధుల సమక్షంలో అత్యంత విజయవంతంగా ముగిసింది. విద్యా రంగంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా సమాజ అభివృద్ధికి సంఘం చేస్తున్న కృషిని అందరూ అభినందించారు.





