-గన్పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఘన నివాళ
‘తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు’ అనే చారిత్రాత్మక నినాదంతో మలిదశ ఉద్యమ కాలంలో పురుడుపోసుకున్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజేఎఫ్) రజతోత్సవాల ముగింపు వేడుకలు ఆదివారం నాడు హైదరాబాద్ గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం దగ్గర అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకల సందర్భంగా టీజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లం నారాయణ ముఖ్య అతిథిగా హాజరై అమరవీరుల స్థూపానికి కొవ్వొత్తులు వెలిగించి భావోద్వేగ భరితంగా నివాళులు అర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జర్నలిస్టులంతా ఏకతాటిపైకి వచ్చి చేసిన పోరాటాలు, త్యాగాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోనూ తెలంగాణ ఉమ్మడి జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) సభ్యులు ఎంతో ఘనంగా టీజేఎఫ్ రజతోత్సవ ముగింపు వేడుకలను నిర్వహించారు. రాష్ట్ర రాజధానిలోని గన్పార్క్ అమరుల స్థూపంతో పాటు, అన్ని జిల్లా కేంద్రాల్లోని అమరవీరుల స్థూపాల వద్ద జర్నలిస్టులు భారీ సంఖ్యలో తరలివచ్చి కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ స్వరాష్ట్ర సాకారంలో జర్నలిస్టులు పోషించిన కీలక పాత్రను, కలం పట్టి చేసిన ఉద్యమ ప్రస్థానాన్ని ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు స్మరించుకున్నారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధన కోసం నిరంతరం శ్రమిస్తామని వారు ఈ వేదికగా స్పష్టం చేశారు. ఈ వేడుకలో తెలంగాణ తొలి ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతోపాటు, సీనియర్ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ సీఎం సీపీఆర్ఓ రమేష్ హజారే, టీయ్యూడబ్ల్యూజే హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్, ప్రముఖ ఫోటో జర్నలిస్టు కందుకూరి రమేష్ బాబు, ఇతర సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.





