
హైదరాబాద్, మే 18: ప్రపంచవ్యాప్తంగా మానవత్వం, దాతృత్వం, సేవాభావాన్ని విస్తరింపజేస్తున్న అంతర్జాతీయ సామాజిక ఉద్యమం “ఆర్ట్ ఆఫ్ గివింగ్ (Art of Giving – AOG)” 13వ వార్షికోత్సవ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా ముగిశాయి. ప్రముఖ విద్యావేత్త, మానవతామూర్తి డాక్టర్ డాక్టర్ అచ్యుత సమంత స్థాపించిన ఈ ఉద్యమం, నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిలో సేవా స్పూర్తిని నింపుతున్న మహత్తర మానవతా వేదికగా నిలిచింది. ఈ ఏడాది “Share to Shine – పంచుకోవడంలోనే పరమానందం” అనే థీమ్తో నిర్వహించిన వేడుకలు మే 11 నుండి 17 వరకు ప్రపంచంలోని ఆరు ఖండాల్లోని 190కి పైగా దేశాల్లో ఘనంగా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 వేల ప్రాంతాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో 50 లక్షల మందికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనగా, వివిధ సేవా కార్యక్రమాల ద్వారా సుమారు 2.5 కోట్ల మందికి లబ్ధి చేకూరింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో “షేర్ టు షైన్” సేవా వారోత్సవాల భాగంగా 400 మందికి పైగా వాలంటీర్లు గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాలు, పట్టణాలు, బస్తీలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆహార పంపిణీ, రక్తదాన శిబిరాలు, పేద విద్యార్థులకు విద్యా సహాయం, క్రీడా సామాగ్రి పంపిణీ, వాలీబాల్ కిట్ల అందజేత, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, మొక్కల నాటకం, యువజన చైతన్య కార్యక్రమాలు, సామాజిక బాధ్యతా సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజంలో మానవీయ విలువలను చాటిచెప్పారు.

ఈ వార్షికోత్సవాల ముగింపు సభను హైదరాబాద్లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, అల్లం నారాయణ, ఆర్. దిలీప్ రెడ్డి, సామాజికవేత్త వి. ప్రకాష్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ సమాజంలో శాంతి, సామరస్యం, మానవీయ విలువలు, పరస్పర సహకారం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న AOG కోఆర్డినేటర్ పి. రాజా రమేష్ బృందాన్ని అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. యువతలో క్రమశిక్షణ, జట్టు భావన, ఆరోగ్యవంతమైన జీవనశైలి పెంపొందించడంలో క్రీడల ప్రాధాన్యత ఎంతో ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక సరికొత్త జాతీయ రికార్డు నమోదైంది. కేవలం మూడు రోజుల్లోనే 3,002 ప్రాంతాల్లో 9,006 వాలీబాల్స్ మరియు 3,002 నెట్లను వాలంటీర్లు పంపిణీ చేయడం ద్వారా “బెస్ట్ ఆఫ్ ఇండియా రికార్డ్స్”లో ఈ కార్యక్రమం స్థానం సంపాదించింది. భారతదేశంలోని ప్రధాన నగరాలతో పాటు ఒక్క ఒడిశాలోనే 2 వేల ప్రాంతాల్లో ఈ వేడుకలు నిర్వహించబడటం విశేషం. అంతర్జాతీయ చెస్ మరియు వాలీబాల్ సమాఖ్యల మద్దతుతో ఈ సేవా సందేశం ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి చేరింది.
ఈ సందర్భంగా డాక్టర్ డాక్టర్ అచ్యుత సమంత తన సందేశంలో మాట్లాడుతూ… “జీవితంలో ఒక చిన్న ఆలోచనగా ప్రారంభమైన ‘ఆర్ట్ ఆఫ్ గివింగ్’ ఉద్యమం నేడు ప్రపంచవ్యాప్తంగా మానవత్వానికి ప్రతీకగా నిలవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రయాణంలో అహర్నిశలు సేవలందించిన వాలంటీర్లు, శ్రేయోభిలాషులు, సహకారదాతలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు,” అని పేర్కొన్నారు.
“ఇచ్చే చేయి ఎప్పుడూ పైనే ఉంటుంది… కానీ ఇచ్చే హృదయం, స్వీకరించే హృదయంతో ఎప్పుడూ సమానంగానే ఉంటుంది” అనే ఉన్నతమైన సందేశంతో నిర్వహించిన ఈ వేడుకలు మానవత్వానికి, సేవాభావానికి, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి





