వాళ్ల వెనుక సీఎం రేవంత్ ఉన్నాడు : ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి సోమవారం ఉదయమే స్వదేశం చేరుకున్న ఆమె వస్తూనే సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ పార్టీలో కీలక వ్యక్తులపై బాంబు పేల్చారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ వల్లనే కేసీఆర్కి అవినీతి మరకలు అంటాయని ఆరోపించారు. తనపై ఎన్ని కుట్రలు చేసిన సహించాను… కానీ తన తండ్రిపై అవినీతి ఆరోపణలు వస్తుంటే తట్టుకోలేపోతున్నట్టు చెప్పారు. కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు పాత్ర లేదా…వాళ్ల స్వార్థం కోసం అవినీతికి పాల్పడ్డారని, అందుకే రెండవ టర్మ్లో ఆయన్ను ఇరిగేషన్ మంత్రిగా తప్పించారని తెలిపారు. హరీష్ రావు, సంతోష్ వెనకాల రేవంత్ ఉన్నాడని పేర్కొన్నారు. అవినీతి అనకొండలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తాను ఎవరు ఆడిస్తే ఆడే ఆటబొమ్మను కాదని, సోషల్ మీడియాలో తనపై వారిద్దరు ఇష్టమున్నట్లు రాయిస్తున్నారని వెల్లడించారు. ఏకంగా పార్టీ అధినేతపైనే సీబీఐ కేసులు పెట్టే స్థాయికి వచ్చాక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. కాళేశ్వరం లాంటి తరగని ఆస్తిలో మేడిగడ్డ అనేది చిన్న భాగమని, తెలంగాణకు నీళ్లు తేవడం కోసం కేసీఆర్ ఆరు, ఏడు నెలలు రీసెర్చ్ చేశారని వివరించారు. కేసీఆర్కు తిండి ధ్యాస, డబ్బు ధ్యాస ఉండదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును 200 ఏళ్ళు ప్రజలు గుర్తు పెట్టుకుంటారన్నారు. సీబీఐ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని స్పష్టం చేశారు.





